హైదరాబాద్ నగరం మరియు పొరుగు జిల్లాలకు చెందిన ఆటో డ్రైవర్ల మధ్య సరిహద్దు వివాదం ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల బండ్లగూడ, మెహిదీపట్నం, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈ కారణంగానే డ్రైవర్ల మధ్య ఘర్షణలు జరిగాయి. సాధారణంగా ఇతర జిల్లాల ఆటోలు నగర పరిధిలోకి రావడానికి అనుమతి లేకపోవడంతో, ఈ విషయమై పొరుగు జిల్లాల డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్టీఏ అధికారుల దృష్టికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి.
చుట్టుపక్కల జిల్లా కేంద్రాలు తమ నివాస ప్రాంతాల నుంచి 100 నుంచి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయని, అక్కడికి రాకపోకలు పెద్దగా లేవని ఇతర జిల్లాల డ్రైవర్లు వివరిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు తమ కార్యకలాపాల నిమిత్తం నగరానికే వస్తుండటంతో, తాము కూడా నగరంలోకి ప్రవేశించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. కానీ, ఇతర జిల్లాల ఆటోలు నగరంలోకి వస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని భావించిన నగర డ్రైవర్లు వారిని అడ్డుకుంటున్నారు.
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఆటోల గిరాకీ గణనీయంగా తగ్గిపోయిందని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న కాస్త గిరాకీ కూడా తమకు రాకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, తమకు గిరాకీ లేక జీరో ఆదాయం వస్తోందని, ఫైనాన్స్ ద్వారా ఆటోలు కొనుగోలు చేసి నెలనెల కిస్తీలు కట్టలేక నష్టపోతున్నామని ఇతర జిల్లాల డ్రైవర్లు బదులిస్తున్నారు.
ఆటో ఉపాధి ప్రశ్నార్ధకంగా మారడమే డ్రైవర్ల మధ్య వాగ్వాదాలకు ప్రధాన కారణమని ఆటో యూనియన్ నాయకులు సత్తిరెడ్డి తెలిపారు. ఉపాధి లేమి వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులే ఈ ఘర్షణలకు దారితీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.








