తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని వినుకొండ మాజీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. ఇటీవల బెయిల్పై విడుదలైన ఆయనను నరసరావుపేటలోని స్వగృహంలో మాజీ మంత్రులు, పార్టీ నేతలు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బ్రహ్మనాయుడు, తనపై నమోదైన కేసు పూర్తిగా కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో జరిగినదని, దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు లేదని ఆరోపించారు.
తన అరెస్టుకు ఐదు రోజుల ముందే నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తనను అరెస్టు చేయిస్తానని బహిరంగంగా ప్రకటించారని, అదే విధంగా చర్యలు తీసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయితీగా వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని, కానీ ఎంపీ కుటుంబం ఆస్తులకు సంబంధించిన వివరాలు, వారు చెల్లించిన జీఎస్టీ (వస్తు సేవల పన్ను), ఆదాయపు పన్నుల వివరాలు బయటపెట్టాలని సవాలు విసిరారు. హైదరాబాద్, విశాఖలలో ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించినది ఎంపీ కుటుంబమేనని ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తాను చదువుకోలేని రైతునని, అయినా ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పనిచేశానని, వైఎస్ జగన్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సేవ చేశానని బ్రహ్మనాయుడు గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కనబెట్టి, రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తోందని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. తనకు మద్దతుగా నిలిచిన పార్టీ అధినేత వైఎస్ జగన్కు, నేతలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, విడదల రజిని, స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని, 74 ఏళ్ల వయసున్న బ్రహ్మనాయుడుపై ఆధారాలు లేకుండా కేసు బనాయించి జైలుకు పంపడం దారుణమని అన్నారు. గండికోట భూముల వ్యవహారంలో బ్రహ్మనాయుడే బాధితుడని, కానీ ఆయననే నిందితుడిగా చిత్రీకరిస్తున్నారని ఆమె విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ, చట్టాన్ని రాజకీయ ఆయుధంగా మార్చి ప్రత్యర్థులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, వాస్తవాలు బయటపడే వరకు వైఎస్సార్సీపీ బ్రహ్మనాయుడుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పార్టీ నేత గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజకీయ వేధింపులు సాగుతున్నాయని, ఇలాంటి చర్యలతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టలేరని తేల్చిచెప్పారు. గండికోట భూముల కేసులో బ్రహ్మనాయుడు బాధితుడే తప్ప నిందితుడు కాదని, నిజాలు త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయని నేతలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.








