హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలోని కాకతీయ హిల్స్లో చోటుచేసుకున్న భూమి వివాదం కేసులో అయ్యన్న ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పి. శ్రీధర్ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయనపై మోసం, నకిలీ సంతకాలు చేసిన అభియోగాల కింద కేసు నమోదు చేసి, విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు.
సుమారు 3,371 గజాల స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు ఏడుగురు యజమానులతో పి. శ్రీధర్ ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఎనిమిది అంతస్తుల భవనం నిర్మించడానికి అంగీకరించగా, తర్వాత అదనంగా రెండు అంతస్తులు కట్టేందుకు ఆయన ప్రయత్నించారు.
అమెరికాలో నివసిస్తున్న నలుగురు భూయజమానుల అనుమతి లేకుండానే, వారి సంతకాలను నకిలీగా సృష్టించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నుంచి అదనపు అనుమతులు పొందినట్లు తేలింది. ఈ విషయం గమనించిన భూయజమానులు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులను ఆశ్రయించడంతో విచారణ మొదలైంది.
విచారణ సందర్భంగా అదనపు అనుమతులకు సంబంధించిన అసలు పత్రాలను సమర్పించాలని పోలీసులు శ్రీధర్ను కోరగా, ఆయన వాటిని అందించలేకపోయారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.






